
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
ఉద్యోగులు మరింత స్వేచ్ఛగా పని చేయడానికి ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డితో కలిసి ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగుల నుంచి 10 వినతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఉన్న సర్వీస్ సమస్యలు పరిష్కారమైతే వారు మరింత స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేయడానికి దోహదపడు తుందన్నారు. ఉద్యోగుల సర్వీసు, పెన్షన్ సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, క్రమశిక్షణ కేసులు, మెడికల్ రీయంబర్స్మెంట్ సమస్యలపై ప్రతినెలా మూడో శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్లో అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.