Sep 20,2023 21:45

యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న కళాశాల విద్య రాష్ట్ర కమిషనర్‌ పోలా భాస్కర్‌

ప్రజాశక్తి - గుంటూరు సిటి : గ్లోబలికరణ నేపథ్యంలో జ్ఞానం విశ్వజనీయంగా విస్తరిస్తున్న క్రమంలో రాష్ట్రంలో కళాశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి విద్యార్థుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కళాశాల విద్య రాష్ట్ర కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల నుండి కళాశాల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం కలిగేలా గుంటూరు నుండి 16 మంది విద్యార్థినులు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య కడప, అనంతపూరం తదితర ఏడు జిల్లాలకు 700 కిలోమీటర్ల పాటు వారం రోజులు నిర్వహించే సైకిల్‌ యాత్ర 'పెడల్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ 2023'ను మహిళా కళాశాలలో పోలా భాస్కర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం ప్రోద్బలంతో కమిషనర్‌ ఆఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, రాష్ట్ర సిఐడి విభాగం, న్యాయ సలహా మండలి, రెడ్‌ రోప్‌ ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో 'క్యాంపెయిన్‌ విముక్తి' పేరుతో యాక్సిస్‌ టు జస్టిస్‌, ఉమెన్‌ ట్రాఫికింగ్‌, జీరో టాలరెన్స్‌, ప్రివెంటివ్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హరాస్మెంట్‌ వంటి అంశాలతో ఆయా జిల్లాలలోని కళాశాలల్లో, పాఠశాలల్లో, విద్యార్థులు ఉద్దేశించి చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. జిల్లా ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ సిఐడి ఎస్పీ కేజీవి సరిత మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ జరిగే అంశాలపై అప్రమత్తతతో ఉండాలని, మొబైల్‌ వాడకంలో, సోషల్‌ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ఉచిత హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాలేజీ ఎడ్యుకేషన్‌ రైడింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ తులసి మస్తానమ్మ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమా జోస్నకుమారి, రెడ్‌ రోప్‌ డైరెక్టర్‌ క్రిషో లైట్‌, సిసిఇ కవిత, ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పి.విజయలక్ష్మి, ఇన్క్యూషన్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సంతోషి, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్లు డాక్టర్‌ ధాత్రి కుమారి, లత, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.