ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్
స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన
ప్రజాశక్తి-నెల్లూరు :77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్, అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో కలెక్టర్ హరినారాయణన్, ఎస్పి తిరుమలేశ్వర రెడ్డి, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ లతో కలసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ప్రొటోకాల్ అనుసరించి సీటింగ్ ఏర్పాట్లను, స్టేజ్ ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ఇన్ఛార్జి మంత్రి , జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రసంగ పాఠం కలదన్నారు. ఇందుకు సంబంధించి స్టేజి అలంకరణ, నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలని ఆర్డిఒను ఆదేశించారు. సీటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు విచ్చేసే ఆహూతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగు నీరు, స్నాక్స్ అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డిఒను ఆదేశించారు.కార్యక్రమంలో అడిషనల్ ఎస్పిలు హిమవతి, శ్రీనివాసరావు, ఆర్డిఒ మలోల, జెడ్పి సిఈఓ చిరంజీవి, డిటిసి చందర్, డిఆర్డిఎ, డ్వామా, హౌసింగ్ పిడిలు సాంబశివా రెడ్డి, వెంకట్రావు, నాగరాజు, డిఇఒ గంగా భవాని, తదితరులు పాల్గొన్నారు.










