Sep 16,2023 00:41

జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: నీతి అయోగ్‌ సూచల మేరకు సుస్థిర అభివృద్ధి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా ''ప్రేరణ'' పేరుతో గోడ పత్రికలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో నిర్దిష్ట కార్యక్రమాలు నిర్వహించడానికి పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాలను పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్య, వైద్య, స్త్రీశిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆకాంక్ష జిల్లా సహకార బృందం ప్రాజెక్ట్‌ మేనేజర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన జనాభాతో గుర్తించబడిన ఆకాంక్షాత్మక జిల్లాలో జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ''ప్రేరణ'' బృందాలు కృషి చేస్తున్నాయని, ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలలో సర్వీస్‌ డెలివరీ, స్టూడెంట్‌ లెర్నింగ్‌ అవుట్‌కమ్‌ ఎంపిక చేసిన మూడు మండలాల పాఠశాలల్లోని ప్రాథమిక భాష, సంఖ్యా కార్యక్రమాలలో పురోగతిని అర్థం చేసుకోవడానికి బేస్‌లైన్‌ అధ్యయనాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల ప్రామాణిక పఠనం, ప్రాథమిక అంకగణిత నైపుణ్యాలను సాధించడంపై, అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రారంభ బాల్య అభివృద్ధి, విభిన్న సేవలపై దృష్టి పెడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ జే.శివ శ్రీనివాసు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌, జిల్లా రెవిన్యూ అధికారి పి.అంబేద్కర్‌, జిల్లా విద్యాశాఖాధికారి సలీం బాష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్‌ బాష, గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు కొండల రావు, ఐసిడిఎస్‌ పిడి ఎన్‌. సూర్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
పాడేరు:ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో రాజవొమ్మంగి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖ మంజూరు చేసిన రూ.13.39 లక్షల విలువైన వాహనాన్ని మత్స్యకారుడు ముమ్మన ఆదినారాయణకు శుక్రవారం ఐటిడిఏ కార్యాలయం వద్ద లబ్దిదారునికి అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5.31 లక్షల రాయితీని ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. మిగిలిన రుణాన్ని సకాలంలో బ్యాంకుకు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ పధకాలను సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వి.అభిషేక్‌, డిఆర్‌ఓ పి.అంబేద్కర్‌, ఎల్‌డి ఎంరవితేజ, జిల్లా ఫిషరీస్‌ అధికారి శ్రీనివాసరావు, ఎఫ్‌డిఓ సిహెచ్‌ రమేష్‌ పాల్గొన్నారు.