ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్లలో 'గడపగడపకు' కార్యక్రమంలో పాల్గొనే వైసిపి నాయకులను గ్రామంలోని సమస్యలపై నిలదీయాలని టిడిపి యూత్ మండల అధ్యక్షులు రంగస్వామి నాయుడు, మండల మైనారిటీ నాయకులు నూర్ అహ్మద్ కోరారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. మొట్టిగేరిలో ప్రజలకు బియ్యం పంపిణీ చేసే వాహనాలు 2 నెలలుగా కనిపించటం లేదని చెపితే ఒక నెల వాహనం చెడిపోయిందని తెలిపారని అన్నారు. మరో నెల సర్వర్ మోరాయిస్తుందని అంటున్నారని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపుపై, రైతుల వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తామన్న నేతలు ఇప్పుడు కేవలం 7 గంటలు ఇస్తున్నారని తెలిపారు. ఎల్ఎల్సి కాలువ ద్వారా రావాల్సిన నీటిని రాకుండా పొలాలను ఎండగొడుతున్నారని, గోనెగండ్ల మండలాన్ని కరువు ప్రాంతంగా ఎందుకు ప్రకటించలేదో ప్రశ్నించాలని చెప్పారు. రాంపురం రంజాన్, భారతం రహమతుల్లా, పూజారి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న టిడిపి నాయకులు










