ప్రజాశక్తి - రంపచోడవరం
సత్యసాయి వాటర్ స్క్రీమ్ వర్కర్స్ ప్రాజెక్టులో 5 మండలాల్లో పనిచేస్తున్న 145 గ్రామాల పరిధిలో కార్మికులకు బకాయి ఉన్న 10 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, సిఐటియు జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. సత్యసాయి వాటర్ స్కీం వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం దీక్ష శిబిరాన్ని కిరణ్, వెంకట్ సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేయాలని, తాము అండగా ఉంటామని చెప్పారు. ఉన్నతాధికారులు దిగొచ్చి పది నెలల వేతనాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్మికులు నిరుత్సాహ పడకుండా పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, తీగల శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.










