Apr 26,2023 23:16

సమావేశంలో పాల్గొన్న దేవదాయ, పోలీసు, వివధ శాఖల అధికారులు


ప్రజాశక్తి - అన్నవరం
సత్యదేవుని బ్రహోత్సవాకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్‌పి ఎస్‌. సతీష్‌కుమార్‌ తెలిపారు. రత్నగిరిపై ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై బుధవారం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం ఇఒ చంద్రశేఖర్‌ ఆజాద్‌, దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్‌, పాలక మండలి సభ్యులు స్థానిక సర్పంచ్‌ కుమారరాజా, వివిధ శాఖల అధికారులతో ఎస్‌పి సతీష్‌కుమార్‌ సమన్వ సమావేశం నిర్వహించారు. బ్రహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికులలో వృద్ధులు, చిన్నారులు, మహిళలకు, విఐపిలకు, సామాన్య యాత్రికులకు శ్రీఘ్రగతిన దర్శనం ఏర్పాట్లు చేసి, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన దేవాదాయ శాఖ అన్నవరం ఇఒను, ఆర్‌జెసిని ఎస్‌పి కోరారు. జిల్లా ఎస్‌పి, అడిషనల్‌ ఎస్‌పి పి.శ్రీనివాస్‌, స్థానిక పోలీసు అధికారులు, దేవాదాయశాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో కలసి కొండపెకి, దిగువకు వెళ్లే ఘాట్‌ రోడ్లను, కొండ దిగువన వాహనాల పార్కింగ్‌ నిమిత్తం నిర్దేశించబడిన ఖాళీ ప్రదేశాలను, భక్తులకు స్వామి వారి దర్శనం కోసం ఏర్పాటుచేసిన వివిధ క్యూలైన్లను, స్వామి వారి కళ్యాణం, గ్రామోత్సవం తిరిగే ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా పోలీసులు భద్రతా బందోబస్తు ఏర్పాట్లను, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్‌ ప్రదేశాల పర్యవేక్షణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, దొంగతనాల నివారణ మొదలైన అంశాలపై సమావేశానికి హాజరైన వివిధ శాఖ అధికారులు, సిబ్బందికి ఎస్‌పి వివరించారు. సమావేశంలో పెద్దాపురం ఆర్‌డిఒ సీతారామారావు, డిఎస్‌పిలు సుంకర మురళీ మోహన్‌, ఎం.అంబికాప్రసాద్‌, ప్రత్తిపాడు సిఐ కిషోర్‌బాబు, అన్నవరం ఎస్‌ఐ శోభన్‌ కుమార్‌, ఎఎస్‌ఐ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.