Nov 18,2023 22:57

ప్రజాశక్తి-అమలాపురం త్వరలో నిర్వహించనున్న పార్లమెంట్‌, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వ హించేందుకు సన్నాహక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు శనివారం ముమ్మిడివరం శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కళాశాలలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రిసెప్షన్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాలు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు అనువుగా ఏడు స్ట్రాంగ్‌ రూములు, ఏడు కౌంటింగ్‌ కేంద్రాలు ఏడు రిసెప్షన్‌ కేంద్రాలు, పార్లమెంట్‌ ఎన్నికకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల భద్రత కోసం 7 స్ట్రాంగ్‌ రూములు, ఓట్ల లెక్కింపునకు అనువైన 7 కౌంటింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీకి 7 రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాటుకు స్థానిక కళాశాలలో అనువైన వసతులు ఉన్నదీ లేనిదీ అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, జి.కేశవర్ధన్‌ రెడ్డి, ఎఎస్‌పి ఖాదర్‌ బాషా, డిఎస్‌పి ఎం.అంబికా ప్రసాద్‌ పాల్గొన్నారు.