
ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రయివేటీకరణ చేయడం వల్ల ఉపాధిలేమితో పాటు, దేశానికి తీవ్ర నష్టం కలుగుతుందని పిడిఎఫ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ అన్నారు. స్టీల్ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 688వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో విశాఖ జిల్లా ఆవాజ్ కమిటీ నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. శిబిరాన్ని రమాప్రభ సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల దేశానికి, రాష్ట్రానికి, స్థానిక సంస్థలకు గణనీయంగా ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలు జరిగి అన్ని తరగతుల వారికి ఉపాధి లభిస్తుందన్నారు. గత 50 ఏళ్లుగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలో చక్కగా నడుస్తూ, లాభాలను సాధించిందన్నారు. కార్మికుల శ్రమతో కర్మాగారం విస్తరించబడిందని తెలిపారు. నష్టాలు వస్తున్నాయని చెప్పి ఈ కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయడం భావ్యం కాదన్నారు. దీనికి అవసరమైన సొంత గనులను సమకూర్చాలని, బొగ్గు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, బ్యాంకుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతున్న స్టీల్ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటానికి తాను కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా కోశాధికారి ఎస్.జ్యోతీశ్వరరావు, జిల్లా ఆవాజ్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఆయుబ్, కార్యదర్శి అబ్దుల్ అసరఫ్, జహరా ఆరా, వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు అబిదా, అబ్దుల్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.