Jan 25,2023 23:29

సంఘీభావదీక్షనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం నాయకులు మణి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ప్రాణత్యాగల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను నేడు ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో ప్రజానీకానికి సమాధానం చెప్పాలని, స్వలాభం మాని రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని పలువురు రాజకీయ నేతలు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మికులు చేస్తున్న ఆందోళనకు రెండేళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త సంఘీభావ దీక్షలో భాగంగా బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి టిడిపి, కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ (ఎంఎల్‌), సిపిఐ ఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ), స్టీల్‌ గుర్తింపు యూనియన్ల నేతలు సంఘీభావం ప్రకటించారు.
ఈ దీక్షా శిబిరాన్ని నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య బాలమోహన్‌ దాస్‌, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య కెఎస్‌.చలం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలకతీతంగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొంటూ కేంద్రం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం చూస్తే ఈ రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మేరకు శ్రద్ధ వహిస్తున్నాయో అర్థమౌతోందన్నారు. ప్రశ్నించి పోరాటం చేయకపోతే ప్లాంట్‌ మనుగడ సాధ్యం కాదని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విశాఖ ఉక్కు ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ప్లాంట్‌ పరిరక్షణకు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న జనసేన అధినేత స్టీల్‌ప్లాంట్‌పై ప్రధానిని ఎందుకు అడగడం లేదని నిలదీశారు.
ఉక్కు కార్మికులు తలపెట్టిన ప్రజా గర్జనలో ప్రజానీకం స్వచ్చందంగా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షలో మాట్లాడిన వారిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, టిడిపి విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా నాయకులు పి. మణి, సిపిఐ ఎంఎల్‌ (ఎన్‌డి) నాయకుడు వై.కొండయ్య, సిపిఐ (ఎంఎల్‌) నాయకుడు ఆడారి అప్పారావు, కాంగ్రెస్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు గొంప గోవిందరాజు, ఉక్కు ఎఐటియుసి గుర్తింపు యూనియన్‌ నాయకులు డి.ఆదినారాయణ తదితరులు ఉన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు అధ్యక్షతన జరిగిన సంఘీభావ దీక్షలో జిల్లా కార్యవర్గ సభ్యులు బిసిహెచ్‌.మసేన్‌, ఎ.విమల, ఎస్‌కె.రెహ్మాన్‌, కె.సత్యనారాయణ, కె.సత్యాంజనేయ, జి.రాంబాబు, ఆర్‌.శ్రీనివాసరావు, పి.చంద్రశేఖర్‌, సిఎన్‌.క్షేత్రపాల్‌ పాల్గొన్నారు.