
ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపుమేరకు వడ్లపూడి నిర్వాసితకాలనీలో మీసేవ గ్రౌండ్లో ఆదివారం నిర్వాసితులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షనుద్దేశించి టిడిపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. విశాఖ అభివృద్ధి ఉక్కు కర్మాగారం వల్లే జరిగిందని గుర్తించాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
స్థానిక కార్పొరేటర్ బొండా జగన్నాథం మాట్లాడుతూ, 700 రోజులుగా నిర్వాసితులు, కార్మికులు పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడంలేదన్నారు. స్థానిక అధికార పార్టీ నాయకులు మొక్కు బడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 29వ తేదీన కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయరామరాజు, రాజన్రాజు, భాస్కర్, కళ్లేపల్లి శ్రీనివాస్ వర్మ, డివి.అప్పారావు, దానయ్య, రాము, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.