May 31,2023 23:32

మంత్రి బొత్సను కలిసిన కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ నాయకులు


- మంత్రి బొత్సకు కాంట్రాక్టు లెక్చరర్ల వినతి

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
తమ సర్వీసు రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ గొర్ల మాణిక్యం ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి వినతి పత్రం సమర్పించారు. బుధవారం జెఎన్‌టియుకెలో జరిగిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రిని కలిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు లెక్చరర్స్‌ అందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. ఇప్పటికే మాతో పాటుగా పనిచేసిన కాంట్రాక్టు లెక్చరర్స్‌ని తెలంగాణలో రెగ్యులరైజ్‌ చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ అతి తొందరలోనే మీకు కూడా రెగ్యులరైజేషన్‌ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా, డాక్టర్‌. బిఆర్‌. అంబేద్కర్‌ జిల్లాల అధ్యక్షులు షేక్‌ రబ్బానీ గౌస్‌, పి.అలివేలు మంగతాయారు, పెర్వేల సూర్య నారాయణ మూర్తి, విజయకుమార్‌, మూర్తి సుధాకరవర్మ, శివన్నారాయణ పాల్గొన్నారు.