శ్రీరామ్ నగర్లోని సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం
ప్రజాశక్తి-డోన్
పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో నెలకొన్న వీధిలైట్ల, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం కార్యదర్శి నక్కీశ్రీకాంత్,సీపీఎం శ్రీరామ నగర్ శాఖ కార్యదర్శి షేమిమ్ బేగంలు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ వేంకటేశ్వర్లుకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరామ నగర్ కాలనీలో సరఫరా చేస్తున్న తాగునీరు తెల్లవారుజామున 2గంటల నుంచి 3గంటల మధ్య రావడంతో కాలనీ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొద్ది రోజుల్లో ముస్లిం సోదరీ సోదరుల పవిత్ర పండుగ అయిన రంజాన్ నెల ఉపవాసాల రోజులు ఉన్నాయని,ఈ విధంగా తెల్లవారుజామున నీరు సరఫరా చేయడం వల్ల ఏ విధంగా వారు ఉపవాసం దీక్షలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలో సిసి రోడ్లు, వీధి దీపాలు లేక కాలనీలోని కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి విజరు,ఐద్వా పట్టణ అధ్యక్షురాలు గౌసియా, శ్రీరామ నగర్ కాలనీ వాసులు ముంతాజ్ బేగం,మా దేవి,నాగమణి తదితరులు పాల్గొన్నారు.










