శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్కు ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు గుండె సమస్యలున్న చిన్నారులకు ఆశాకిరణం
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్కు ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు
గుండె సమస్యలున్న చిన్నారులకు ఆశాకిరణం
ప్రజాశక్తి- తిరుపతి డెస్క్: టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో గల శ్రీపద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్గా గుర్తించి ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డును ప్రకటించింది. హైదరాబాదులో శనివారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేతులమీదుగా శ్రీపద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.శ్రీనాథ్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
గుండె సమస్యలున్న చిన్నారులకు ఆశాకిరణం
గుండె సమస్యలతో పోరాడుతున్న పిల్లలకు ఆశాకిరణంగా నిలుస్తున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ 2021 అక్టోబరులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైంది. టీటీడీకి చెందిన ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కింద ఈ ఆసుపత్రి నడుస్తోంది. ఇక్కడి డాక్టర్లు 23 నెలల వ్యవధిలో 1910 గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు శస్త్రచికిత్సలతో పాటు ఆరు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఉచిత చికిత్సలు అందిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు, బంగ్లాదేశ్ తదితర దేశాల నుండి చిన్నారులు ఇక్కడ వైద్యం పొందారు. ఇక్కడ శస్త్రచికిత్సలు విజయవంతం అవుతుండడం డాక్టర్ల అంకితభావాన్ని సూచిస్తోంది. మరింత మంది చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న సత్సంకల్పంతో రూ.250కోట్లతో మరో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని టీటీడీ ప్రారంభించింది. 350 పడకల సదుపాయం గల ఈ ఆసుపత్రిలో న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ డిసీజ్, హెమటో ఆంకాలజీ, తలసేమియా కోసం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్, మల్టీ-ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ సహా మొత్తం 14 పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వైద్యచికిత్సలు, ఎయిర్ అంబులెన్స్ అందుబాటులోకి రానుంది.










