'శ్రీ చైతన్య' యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : అనుమతులు లేకుండా స్కూల్ బస్ నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆత్మకూరు డి.ఎస్.పి.కి, ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు బిఎస్పి ఆత్మకూరు అధ్యక్షులు నందా ఓబులేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్కు సంబంధించిన బస్సు సంగం మండలం జెండా దిబ్బ పంచాయతీ అనుబంధ గ్రామమైన ఆరవపాలెం సమీపంలో నెల్లూరు నుండి ఆత్మకూరు వచ్చే క్రమంలో శ్రీ చైతన్య స్కూల్లో బోల్తా పడిందన్నారు. లోతు తక్కువగా ఉండటంతో సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారని తెలిపారు. ఆ బస్సులో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది 30 మంది ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. అనుమతులు లేకుండా పిల్లల జీవితాలతో ఆడుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బస్సులు వెంటనే సీజ్ చేయాలని ఆత్మకూరు డి.ఎస్.పి.కి, ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.రాములుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి చెన్నుపల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ట్రెజరర్ ధర్మయ్య, బి.ఎస్.పి.కార్యకర్తలు పాల్గొన్నారు.










