ప్రజాశక్తి -పాడేరు : సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన స్పందనలో 155 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పీఓ వి.అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తాగునీటి సమస్యలు, రహదారి సదుపాయాలు, కళాశాలలు, పాఠశాల ప్రవేశాలు, అంగన్వాడీ భవనాల మంజూరు, విద్యుత్ సదుపాయం వంటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. అర్జీదారుల పిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులు.. చింతపల్లి మండల కేంద్రంలోని చాడిపేట గ్రామస్తులకు తాగునీటి సదుపాయం కల్పించాలని, సామాజిక భవనం మంజూరు చేయాలని గెమ్మిటి మహేష్, ఎస్.రామన్న వినతి పత్రం సమర్పించారు. అరకు వ్యాలీ మండలం బొండాం పంచాయతీ బి.జాంగూడ గ్రామానికి తాగునీరు, విద్యుత్, రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కిల్లో రాంబాబు, కిల్లో
చిట్టిబాబు తదితరులు కోరారు. పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ తాడివీరి గ్రామస్తులు ఎ.వెంకటరావు, పి.నవీన్ కుమార్ తొట్టేడిపుట్టు నుండి తాడివీధి వరకు రోడ్డు నిర్మించాలని కోరారు.డుంబ్రిగుడ మండలం అరుకు పంచాయతీ అరుకు గ్రామంలో వోల్టేజి విద్యుత్ సమస్యతో బాధపడుతున్నామని, ట్రాన్సఫార్మర్ మార్చాలని జెడ్.పి.టి.సి, చట్టారి, ఎం.పి.టి.సి ఎల్. వరాలమ్మ వినతి పత్రం అందజేసారు. జి.మాడుగుల మండలం సంతబయలు గ్రామానికి అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని ఎస్. సరోజిని వినతి పత్రం సమర్పించారు. చింతపల్లి మండలం: అంజలి శనివారం పంచాయతీ వెదురుపల్లి నుండి తామరపల్లి గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు వంతల లక్ష్మణరావు, పొంగి బిర్సన్న వినతి పత్రం సమర్పించారు. డుంబ్రిగుడ మండలం తూటంగ్ పంచాయతీ జర్రాయి నుండి బుడ్డింగు గ్రామానికి, జర్రాయి నుండి బబ్జాగడ్డ వరకు రోడ్డు నిర్మించాలని సర్పంచ్ జి, కమల, వార్డు మెంబరు ఎం. సీత కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండల రావు, ఇఇలు డి.వి.ఆర్. ఎం. రాజు, కె.వేణుగోపాల్, పంచాయతీ రాజ్ పి. వి. యు, ఇఇ కె.లావణ్య కుమార్, పంచాయతీ రాజ్ ఇఇ టి.కొండయ్య పదాల్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్టి. ఎస్. నంద్, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్ రావు, డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్, తదితరులు పాల్గొన్నారు.
13 ఎస్హెచ్జిలకు బ్యాంకు లింకేజీ:
పాడేరు : అరకువ్యాలీ మండలానికి చెందిన 130 స్వయం సహాయక సంఘాలకు కోటి 52 లక్షల బ్యాంకు లింకేజీ చెక్కును జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పీఓ వి. అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ చేతుల మీదగా శుక్రవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో పంపిణీ చేసారు. బ్యాంకు లింకేజీని సద్వినియోగం చేసుకోవాలని పిఓ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి వి.మురళి, ఎపిఎంలు, ఎస్హెచ్జి మహిళలు తదితరులు పాల్గొన్నారు.










