
ప్రజాశక్తి-రంపచోడవరం
స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 50 అర్జీలు అందాయి. వీటిని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఐటిడిఎ ఏపీఓ సిహెచ్ శ్రీనివాసరావు స్వీకరించారు. రంపచోడవరం మండలం ఐ.పోలవరం గ్రామం నుండి ఏర్పాటు చేసిన 516ఇ నేషనల్ హైవే రోడ్డుకి ఇరువైపులా చెట్లు, ఇండ్లు నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని 60 మంది బాధితులు విన్నవించారు. పాడి గేదెలు కొనుగోలు చేసి చేయడానికి రుణాలు మంజూరు చేయాలని దేవీపట్నం మండలం, పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుడు మడకం రామన్న దొర, భూపతిపాలెం ప్రాజెక్టు ద్వారా దొరమడుగులు గ్రామానికి చెందిన 70 మంది రైతులకు 200 ఎకరాలకు సాగునీరు ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు దరఖాస్తు చేశారు. భూ సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వంటి వాటి కోసం కొన్ని దరఖాస్తులు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్రాజ్, డిఎస్ శాస్త్రి, డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవన్, ఏడిఎంహెచ్ఓ జి.ప్రకాశం. వెలుగు ఎపీడీ ఎ.శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ షరీఫ్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్కెవి.చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.