స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి. నిశాంతితో కలిసి కలెక్టర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో పెండింగులో వున్న కోర్టు కేసులను నేరుగా కౌంటర్ ఫైల్ చేయకుండా జిల్లా కేంద్రంలోని పైఅధికారుల ఆమోదం తీసుకొని కౌంటర్ ఫైల్ చేయాలన్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా వెంటనే అమలు పరచేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే వ్యతిరేక వార్తలపై కూడా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి యాక్షన్ టెక్ అండ్ రిపోర్ట్ లు నాణ్యతతో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిఐపీఆర్ఓ జయరావును ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










