Jul 31,2023 21:55

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జగనన్నకు చెబుదాం, స్పందన ఫిర్యాదులను మండల స్థాయిలోనే పరిష్కరించే విధంగా తహశీలార్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌ లో పాల్గొన్న కలెక్టరు ప్రజల నుంచి 197 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌, డిఆర్‌ఒకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ, స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జగనన్న సురక్ష అమలులో రాష్ట్రంలోనే సత్యసాయి జిల్లా మూడవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమన్నారు. వాలంటీర్లు ఇంటి ఇంటి సర్వే 80 శాతం పూర్తి చేశారన్నారు. మిగిలిన 20 శాతం త్వరగా పూర్తి చేయాలన్నారు. ముదిగుబ్బ, మడకశిర, తలపుల, రొళ్ళ, కదిరి, ఎన్‌ పి కుంట మండలాలు వెనుకబడి ఉన్నాయని ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, డిపిఒ విజరు కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ద్వామా పీడీ రామాంజనేయులు, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, ల్యాండ్స్‌ సర్వే ఏడీ రామకృష్ణ, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి శివ రంగ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.