స్పందన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం
జిల్లా ఎస్పి కె.రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే చట్ట పరిధిలో పరిష్కారం చూపుతున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. సోమవారం నంద్యాల జిల్లాలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ స్పందన ఫిర్యాదులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలన్నారు. ఎక్కువగా సివిల్ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేదింపులు తదితర ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కల్పన తదితరులు పాల్గొన్నారు.










