Aug 14,2023 21:39

కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్న అర్జీదారుడు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి 27 అర్జీలను కలెక్టరు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్‌డిఒ భాగ్యరేఖ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేశారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పెండింగ్‌ బియాండ్‌, ఎస్‌ఎల్‌ఎ రీ ఓపెనింగ్‌ లేకుండా పరిష్కరించాలన్నారు. మంగళవారం పోలీస్‌ పరేడ్‌ మైదానం లో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ మునిసిపాలిటీ పరిధిలోని చిన్నపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఓబుళపతి, కౌన్సిలర్‌ చెరువుభాస్కర్‌ రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ నారాయణరెడ్డి, రాష్ట్ర నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, హౌసింగ్‌ పీడీ చంద్ర మౌళి రెడ్డి, డిపిఒ విజరు కుమార్‌, సర్వే ల్యాండ్స్‌ ఏడీ రామకృష్ణ, పట్టు పరిశ్రమల శాఖ జేడీ పద్మమ్మ, డ్వామా పీడీ రామాంజనేయులు, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.