ప్రజాశక్తి- బూర్జ: జగనన్న ఇళ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో వర్షాకాలంలో నానా అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వద్ద వాపోయారు. మండలంలోని తోటవాడలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో సమస్యలు వెల్లువెత్తాయి. అలాగే వీధుల్లో కాలువలు ఏర్పాటు చేయాలని, కొంతమంది అమ్మఒడి పథకం తమ ఖాతాలో జమ కాలేదని మొరపెట్టుకున్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ... అమ్మఒడి పథకం అర్హులైన ప్రతిఒక్కరికీ ఒకటి రెండు రోజుల్లో మీ ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. జగన్న ఇళ్ల బిల్లులు కూడా త్వరలో జమవుతాయని అన్నారు. అలాగే కాలువల నిర్మాణలకు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కర్నేన నాగేశ్వరావు, జెడ్పిటిసి బెజ్జిపురపు రామారావు, టిడ్కో రాష్ట్ర డైరెక్టర్ ఖండాపు గోవిందరావు, వైస్ ఎంపిపి బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, డిసిఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాంనాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు, సర్పంచ్ సూర ఆనందరావు, అధికారులు పాల్గొన్నారు.










