Jul 14,2021 06:24

     'మీరు సంస్కరణలకు అనుకూలమా, లేదా ప్రతికూలమా?' అని నిరంతరం అడుగుతుంటారు. ఏ సంస్కరణ కూడా సంపూర్ణం కాదు. ప్రతీ సంస్కరణకూ కొంత విషయం వుంటుంది, ఒక ప్రయోజనం వుంటుంది. వామపక్షాలు ఏ నిర్దిష్ట సంస్కరణకైనా మద్దతివ్వాలా లేక వ్యతిరేకించాలా అనేది ఇవి నిర్ణయిస్తాయి. ఈ సంస్కరణలనేవి మన ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడతాయా, వారి జీవనోపాధులు, దేశ ఆర్థిక సార్వభౌమాధికారం బలోపేతం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంటుంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో మా వైఖరి ఇలానే వుంటూ వచ్చింది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది.

    మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలంటూ మన రైతాంగం కనివినీ ఎరుగని రీతిలో పోరాటం కొనసాగిస్తూనే వుంది. శతాబ్దం క్రితం బలవంతంగా నీలిమందు మొక్కలను పెంచడానికి నిరసనగా జరిగిన చంపారన్‌ సత్యాగ్రహం స్మృతులు గుర్తుకు వస్తున్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం, చిన్న మొత్తాల్లో ఉత్పత్తిని దెబ్బతీయడం (మోడీ పెద్ద నోట్ల రద్దు), ఆహార కొరతలు...ఇవన్నీ కలిసి కరువు కాటకాలు పెంచేలా చేయవచ్చు.
    పేదలను పణంగా పెట్టి గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడం, పెరుగుతున్న దారిద్య్రం, మరింతగా విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు, అన్ని దేశాల్లో తీవ్రంగా పడిపోయిన దేశీయ డిమాండ్‌ పైనే దశాబ్దాల తరబడి సంస్కరణలు ప్రధానంగా దృష్టి పెడుతూ వస్తున్నాయని అంతర్జాతీయ, భారతదేశ అనుభవాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం, ప్రజల జీవితంపై దాని ప్రభావం వినాశకరమైన రీతిలో వుంది. ఇది, కరోనాతో మరింతగా పెరిగిపోయింది. ఇంకా ఆ ప్రభావం కొనసాగుతూనే వుంది. ఇది మార్క్స్‌ మాటలను గుర్తుచేస్తోంది: 'పెట్టుబడిదారీ విధానం భారీ ఉత్పత్తి, మారకపు మార్గాలను సమకూర్చుకుంది. ఇది క్షుద్ర ప్రపంచంలో మంత్రాలు, మాయలతో శక్తులను సృష్టించే మాంత్రికుడి లాంటిది. ఆ తరువాత వాటిని అదుపు చేయడంలో ఆ మాంత్రికుడు విఫలమవుతాడు.'
      అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఆధిపత్యంలోని నయా ఉదారవాద విధాన నిర్మాణంలో అంతర్భాగమే భారతదేశంలో సంస్కరణల క్రమం. ఇక్కడ గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడమే లక్ష్యం. ఇది, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యంత అద్వాన్నమైన స్వభావాన్ని తెలియచేస్తోంది. జంతు స్ఫూర్తిని వెల్లడిస్తోంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను, అన్ని ప్రభుత్వ సంస్థలను, సేవలను, ఖనిజ వనరులను ప్రైవేటీకరించడానికి...ప్రజలపై యూజర్‌ చార్జీల భారాన్ని మోపడానికి దారితీసింది. నయా ఉదారవాదమనేది అంతర్జాతీయంగా, భారత్‌లో కార్పొరేట్లకు పెద్ద లాభదాయకంగా మారింది. నయా ఉదారవాదం ప్రారంభమైనప్పటి నుండి సంపన్నులపై పన్నులు విధించడం అంతర్జాతీయంగా 79 శాతం తగ్గింది. 2008లో ఆర్థిక మాంద్యం తర్వాత, మూడేళ్ళ లోనే చాలామంది కోటీశ్వరులు తమ సంపదను పునరుద్ధరించుకున్నారు. 2018 నాటికి వారి సంపద రెట్టింపు అయింది. ఈ సంపద అంతా ఉత్పత్తి ద్వారా పెరగలేదు. తీవ్రంగా వున్న ఈ ఆర్థిక మాంద్యం స్టాక్‌ మార్కెట్లను ఎందుకు ప్రతికూలంగా ప్రభావితం చేయలేదో వివరించిన స్పెక్యులేషన్‌ ద్వారా పెరిగింది.
      మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది ఆదాయం సంపాదించేవారు 2008 ముందు నాటి స్థాయికి కోలుకోలేదు. సంఘటిత రంగంపై, కార్మికవర్గ హక్కులపై దాడుల ఫలితంగా 1979లో ప్రతి నలుగురిలో ఒకరికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలు... ఈనాడు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే స్థాయికి క్షీణించాయి.
 

                                                      భారత్‌ : అసమానతల పెరుగుదల

    పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. 'షైనింగ్‌ ఇండియా' (వెలిగిపోతున్న భారతదేశం) ఎల్లప్పుడూ సఫరింగ్‌ ఇండియా (బాధలు పడుతున్న భారతం) పైనే స్వారీ చేసేది. వెలిగిపోతున్న భారత్‌...కమిలిపోతున్న భారత్‌కు విలోమానుపాతంలో వుంటుంది.
      2020 మార్చి నుండి భారతదేశం లోని వంద మంది కోటీశ్వరులు తమ ఆస్తులను రూ.12,97,822 కోట్లు పెంచుకున్నారు. అంటే దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున చెక్‌ ఇవ్వగలిగేంత. కరోనా సమయంలో ముఖేష్‌ అంబానీ సంపాదించే మొత్తాన్ని ఒక నైపుణ్యం లేని కార్మికుడు సంపాదించాలంటే 10 వేల సంవత్సరాలు పడుతుంది. అంబానీ ఒక సెకనులో సంపాదించే మొత్తాన్ని ఈ కార్మికుడు మూడేళ్ళకు సంపాదిస్తాడని ఆక్స్‌ఫామ్‌ నివేదిక 'ది ఇనీక్వాలిటీ వైరస్‌' లోని తాజా భారత్‌ అనుబంధ నివేదిక పేర్కొంది.
       మరోవైపు, 2020 ఏప్రిల్‌లో ప్రతి గంటకు లక్షా 70 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారత కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. 2009 నుండి చూసినట్లైతే 90 శాతం పెరిగి 42.29 వేల కోట్లకు చేరుకుంది. వాస్తవానికి, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 11 మంది కోటీశ్వరుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పదేళ్ళపాటు లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖను పదేళ్ళపాటు నిర్వహించవచ్చు.
     పైస్థాయిలో వున్న 20 శాతం లోని 93.4 శాతంతో పోల్చుకుంటే...నిరుపేదలైన 20 శాతంలో కేవలం ఆరు శాతానికే మెరుగైన పారిశుధ్య వనరులు అందుబాటులో వున్నాయి. భారత జనాభాలో దాదాపు 59.6 శాతం మంది ఒక్క గది లోనో లేదా అంతకంటే చిన్న జాగా లోనో బతుకుతున్నారు.
      ప్రభుత్వ వ్యయం వాటాను బట్టి చూసినట్లైతే ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ఆరోగ్య రంగ బడ్జెట్‌ వున్న దేశాలలో భారత్‌ నాల్గవ స్థానంలో వుంది. కరోనా సమయంలో పెరిగిన తమ సంపదపై కనీసం ఒక శాతం పన్నును దేశంలోని పైస్థాయిలో వున్న 11 మంది కోటీశ్వరులు కట్టినా కూడా 'జన్‌ ఔషధి' పథకానికి కేటాయింపులను 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది. ఈ పథకం వల్ల పేదలు, అట్టడుగు వర్గాల వారికి మందులు అందుబాటులో వుంటాయి.
     భారతదేశంలో దశాబ్దాలుగా అమలవుతున్న సంస్కరణలు ఆర్థిక అసమానతలను తీవ్రంగా పెంచుతున్నాయి. ప్రజలను దృష్టిలో వుంచుకుని వారికి అనుకూలమైన రీతిలో కాకుండా... పెట్టుబడిదారులు లాభాలు ఆర్జించే రీతిలో సంస్కరణలు తీసుకు వస్తున్నారు. సంపద సృష్టికర్తలను గౌరవించాలని ప్రధాని మోడీ మనకు ఉద్భోదిస్తున్నారు. సంపద అంటే విలువను డబ్బు రూపంలోకి మార్చడమే. ఆ విలువను సృష్టించేది కార్మిక వర్గమే. మన ప్రజల సర్వతోముఖ సంపదకు విలువను సృష్టించే వారిని గౌరవించాల్సిన అవసరముంది.
 

                                                             దారిద్య్రం : అపార వృద్ధి

    ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు మోడీ ప్రభుత్వం, స్వాతంత్య్రం సముపార్జించినప్పటి నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చినదాన్ని (దారిద్య్ర స్థాయిని లెక్కించడానికి మౌలికమైన పోషకాహార నిబంధనను) విడిచిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 2200 క్యాలరీల పోషకాహారం వుండాలి. పట్టణ భారతంలో అయితే అది 2100 క్యాలరీలుగా వుండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూసినట్లైతే 1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 57 శాతం మంది ఈ దారిద్య్ర రేఖకు దిగువున వున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ నమూనా సర్వే తెలియచేస్తోంది. 2011-12లో మరోసారి నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేలో ఈ శాతాలు వరుసగా 68, 65కు పడిపోయాయి. తిరిగి 2017-18లో మరోసారి విస్తృతంగా నమూనా సర్వే నిర్వహించారు. కానీ మోడీ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఫలితాలను వెల్లడించకుండా తొక్కిపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన డేటాబేస్‌ సంస్థలను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. గ్రామీణ భారతంలో తలసరి వాస్తవ వినిమయం వ్యయం (కేవలం ఆహారమే కాదు) కేవలం 9 శాతంగా మాత్రమే వుందని మీడియాకు లీకైన డేటా తెలియచేసింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందుగానే గ్రామీణ, పట్టణ భారతాల్లో సంపూర్ణ స్థాయిలో దారిద్య్రం అనూహ్యంగా పెరిగిందన్నది సుస్పష్టం. అప్పటి నుండి పరిస్థితి మరింత అద్వాన్నంగా మారింది.
     కోవిడ్‌ మహమ్మారి విజృంభణ...ప్రజల ప్రాణాలను, వారి ఉపాధులను కాపాడేందుకు అరకొరగా వున్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఇబ్బందులు... పరిస్థితులను బహిర్గతం చేశాయి. ఈనాడు మనం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాంద్యం అంతర్జాతీయ నయా ఉదారవాద విధానంలో భాగమే. ఏదోవిధంగా ప్రజలను తీవ్ర స్థాయిలో దోపిడీ చేయడం ద్వారా లాభాలను గరిష్టంగా ఆర్జించాలన్నదే ఈ నయా ఉదారవాద విధానం. పొదుపు చర్యల నుండి వేతనాల్లో కోతల వరకు, ఉద్యోగాల లేఆఫ్‌లు, మరీ ముఖ్యంగా చిన్న స్థాయిలో ఉత్పత్తిని దెబ్బ తీయడం (భారత్‌లో ఇది పెద్ద నోట్ల రద్దు ద్వారా జరిగింది) వంటి చర్యల ద్వారా ప్రజలను దోపిడీ చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని మార్గాలను ఆక్రమించుకోవడం, ఇప్పుడు కార్పొరేట్‌ లబ్ధి కోసం భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం, కాంట్రాక్ట్‌ వ్యవసాయం, ఫలితంగా ఆహార కొరత వంటివి ఈ విషయాన్ని మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాయి.
       ఈనాడు, అంతర్జాతీయ ఆకలి సూచీ భారత్‌ను 'తీవ్రమైన కేటగిరీ'లో నిలిపింది. పోషకాహార లోపం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని, మరీ ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా వుందని, ఫలితంగా శిశు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 తెలియచేసింది.
 

                                                          మతోన్మాదం-కార్పొరేట్ల బంధం

    2014 తరువాత కార్పొరేట్‌, మత రాజకీయాల యొక్క విషపూరిత బంధం ఆవిష్కృతమైంది. జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా గరిష్టంగా లాభాలను ఆర్జించడమన్నది చాలా దూకుడుగా అమలు చేశారు. ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు. ప్రభుత్వ సంస్థలను, గనులను కూడా ప్రైవేటీకరించారు. ఫలితంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. అసమ్మతివాదులందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. నిరంకుశ యుఎపిఎ, దేశద్రోహ చట్టం కింద ప్రజలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమం ఇటు భారత రాజ్యాంగాన్ని, అటు ప్రజలకు ఇచ్చిన హామీలను దెబ్బతీసింది.
       ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ (గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫ్రీడం ఇండెక్స్‌) భారత్‌ను 105వ స్థానంలో నిలిపింది. గతేడాది కన్నా ఇది అద్వాన్నమైన స్థితి. గతేడాది 79వ స్థానంలో వుంది. మానవ హక్కుల సూచీలో భారత్‌ 94 నుండి 111కి పడిపోయింది. యుఎన్‌డిపి మానవ వికాస సూచీ మనల్ని ఇంకా కిందకు...అంటే గతేడాది వున్న 129 నుండి 131వ స్థానానికి దింపేసింది.
      మెజారిటీ ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులతో పాటుగా పెరుగుతున్న నియంతృత్వం...ముస్సోలిని ఫాసిజానికి చెప్పిన నిర్వచనం 'పాలనతో కార్పొరేట్ల కలయికకు' దగ్గరగా ఉంది.
    ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో నూతన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోంది. అసమానతలు వృద్ధికి ఆటంకం కలిగించి, అసమర్ధతను పెంచే స్థాయికి చేరుకున్నాయి' అని 'ది ఎకానమిస్ట్‌' పత్రిక పేర్కొంది.
 

                                                   నయా ఉదారవాద సంస్కరణల దివాళా

      పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యయాలతో కూడిన ఉద్దీపన ప్యాకేజీలను అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రకటించాయి. ఇవి నయా ఉదారవాదానికి శాపంగా పరిణమిస్తాయి. దేశీయ డిమాండ్‌ను, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ''నేను కమ్యూనిస్టును కాను, కానీ....'' అంటూ ప్రభుత్వ వ్యయం పెంచడాన్ని సమర్ధిస్తూ ఇటీవలే బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రసంగించారు.
    అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ వ్యయం పెంచడం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ తన ఆశ్రితులు చెల్లించని పెద్ద మొత్తంలోని రుణాలను మాత్రం రద్దు చేస్తోంది. రోజువారీ పెట్రో ధరల పెంపు ద్వారా ప్రజలపై భారాలు మోపుతోంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీనివల్ల దేశీయ డిమాండ్‌ మరింతగా క్షీణిస్తోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది.
   భారత్‌లో ఈ సంస్కరణల పంథాను మనం తీవ్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మన ప్రాధాన్యాలేంటనేది పున:నిర్వచించుకోవాల్సి వుంది. వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి. ఆహార భద్రతను పటిష్టపరచాలి. ఆరోగ్యం, విద్యపై పెట్టుబడి పెంచాలి. ప్రస్తుతం మనకు ఎంతగానో అవసరమైన-ఆర్థిక, సామాజిక-మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభుత్వ పెట్టుబడులు పెద్దఎత్తున పెరగాలి. అప్పుడే ఉద్యోగాలు సృష్టించబడతాయి. దేశీయ డిమాండ్‌ పెరుగుతుంది. కేవలం మానవతావాద ఆందోళనలతోనే కాకుండా, సమానమైన ఆర్థిక పునరుద్ధరణకు కూడా ఇదొక్కటే మార్గం. అస్పష్టత, అహేతుకత, మన సమాజాన్ని అమానవీయం చేసేలా, మన సామాజిక సామరస్యతను దెబ్బ తీసే అన్ని విచ్ఛిన్నకర ధోరణులను తిరస్కరించడం అన్నింటికంటే ముఖ్యమైనది.
     ప్రజా ప్రయోజనాలే కీలకమైన అటువంటి సంస్కరణలు ఈనాడు భారతదేశానికి అవసరం. అంతేగానీ కార్పొరేట్‌ లాభార్జనే థ్యేయంగా గల సంస్కరణలు కాదు.
     ఇటువంటి సంస్కరణల దిశను సాకారం చేయగలిగే వేదిక ప్రజా పోరాటాలను బలోపేతం చేస్తుంది. ప్రత్యామ్నాయ సంస్కరణల పంథాను సూచించగల ప్రజా ఉద్యమాలు, సమీకరణలు తగినంత బలాన్ని పుంజుకోవాల్సి వుంది. మన ప్రజలపై మరిన్ని భారాలను మోపుతున్న, వారిని దెబ్బ తీస్తున్న భారత పాలక వర్గాల ప్రస్తుత దిశను మార్చగలిగేలా ఈ ఉద్యమాలు వుండాలి. భారతదేశంలోని మూడు దశాబ్దాల సంస్కరణల క్రమం సరైన దిశ లోకి మారడానికి ఇదే సముచితమైన సమయం.
 

/వ్యాసకర్త సిపిఎం ప్రధాన కార్యదర్శి/

సీతారాం ఏచూరి

సీతారాం ఏచూరి