తెనాలి: సంక్షేమం ముసుగులో పేదలపై భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు టిడిపి చేపట్టిన జన జాగృతి యాత్ర సోమవారం రూరల్ గ్రామం కొలకలూరు లో ప్రారంభమైంది. ఇంటింటికి తిరిగిన ఆలపాటి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అర్హులై కూడా సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులై కూడా దక్కడం లేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పేదలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, పన్నుల భారం మోపి వారి పరిస్థితి మరింత దిగజార్చుతోందని అన్నారు. ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి కబుర్లను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజేంద్రప్రసాద్ వెంట టిడిపి నాయకులు కోటేశ్వరి, కె.శ్రీను, ఎస్ కిరణ్ ఉన్నారు.










