సంక్షేమ పథకాలే ధీమా : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - మంత్రాలయం
సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసిపిని గెలిపిస్తాయని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని రచ్చుమర్రి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, హెల్త్ క్లినిక్ సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర కారణంగానే వర్షాలు వెనక్కి వెళ్తున్నాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. అనంతరం జగనన్న సురక్షలో భాగంగా లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల ఇంచార్జీ విశ్వనాథ్ రెడ్డి, జెడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్ మేకల సుజాత, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ మణిమంజరి, ఎస్ఐ కిరణ్ బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కౌతాళం : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సురక్ష పథకం పేదలకు ఒక వరమని ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ అన్నారు. ఉరుకుంద గ్రామంలో లబ్ధిదారులకు ధృవపత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజశేఖర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










