Jun 21,2023 19:24

సంక్షేమ పథకాల లబ్ధి పత్రాలను అందిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని 26వ వార్డు సచివాలయంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, సిసి రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రణాళిక ప్రకారం సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. వార్డు కౌన్సిలర్‌ నీలకంఠ, కేశవరెడ్డి, వైసిపి అధికార ప్రతినిధి సునీల్‌ కుమార్‌, వైస్‌ ఛైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.