కడప : దేశంలోనూ, రాష్ట్రంలోనూ సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. శనివారం జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి సుమంత్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీనగర్ స్కూల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు పార్టీ శ్రేణష్ట్రలు డప్పువాయిద్యాల నడుమ ఆయనకు స్వాగతం పలికారు. ర్యాలీ పార్టీ కార్యాలయం వరకు నిర్వహించారు. నగర అధ్యక్షులు విష్ణుప్రీతమ్రెడ్డి అధ్య క్షతన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిజంగా గౌతమ్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ పూసే లేదన్నారు. చెన్నూరు చక్కర కర్మాగారం తెరిపిస్తామని చెప్పి ఇంతవరకు అతీగతి లేదన్నారు. సీఎం సొంత జిల్లాలో, రాష్ట్రంలో హత్యలు అధికమయ్యాయని వాపోయారు. 25 ఎంపీ స్థానాలు వైసీపీకి ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోయాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చేస్తుందన్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన విశాఖ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అని అమిత్షా అన్నారని, అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. ఎఐసిసి కార్యదర్శి మేయ్యప్పన్ మాట్లాడుతూ టిడిపి, వైసిపిలు రెండూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసు కురావడంలో పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు స్థానికంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయ కమిటీలను వేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి మాట్లాడుతూ మోడీ, బాబు, జగన్ ముగ్గురు రాయలసీమ ద్రోహులు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రీతం రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ సాకే శంకర్, మైనార్టీ చైర్మన్ గాంధీ, యువజన విభాగం అధ్యక్షుడు రామారావు, రాష్ట్ర నాయకులు కమలమ్మ, బండి జకరయ్య నజీర్ అహ్మద్, గుండ్లకుంట్ల శ్రీరాములు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ కుమార్, రాష్ట్ర నాయకులు బొజ్జ తిరుమలేష్ పాల్గొన్నారు.
నేతలను సన్మానించిన సలావుద్దీన్
కడప అర్బన్ : నగరంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జి మయప్పన్, ఏపీసిసి మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి ని ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ ఘనంగా సన్మానించారు. సలావుద్దీన్ చేస్తున్న సేవలను నాయకులు అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నజీర్ అహ్మద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.










