ప్రజాశక్తి- ములగాడ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రద్దు నిర్ణయాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా నాయకులు కె. పెంటారావు డిమాండ్ చేశారు. గురువారం 59వ వార్డు నెహ్రూ నగర్ లేబర్ జంక్షన్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంక్షేమ బోర్డులోని కార్మికుల సొమ్మును బీమా కంపెనీలకు రూ.830 కోటు,్ల పవర్ ఫైనాన్సు కార్పొరేషన్కు రూ.450 కోట్లు మళ్లించి కార్మికుల సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడం దుర్మార్గమన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను జగన్ ప్రభుత్వం విడనాడాలని, సంక్షేమ బోర్డు రద్దు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్కాపురం జోన్ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు జె. రామనాయుడు, ఎల్.రాంబాబు అప్పారావు, రాము, రాజు, రామారావు చిన్నారావు పాల్గొన్నారు.










