ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ ఈనెల 23వ తేదీలోగా మున్సిపల్ కార్పొరేషన్ పర్మినెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే మెరుపు సమ్మె చేపడతామని సిఐటియు నేతలు హెచ్చరించారు. ఈమేరకు సోమ వారం స్థానిక మున్సిపల్ కార్పొరేష న్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 50సార్లు స్పందన కార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించామన్నారు. అయినా కార్మిక సమస్యల పరిష్కారం దిశగా అటు ప్రభుత్వంకానీ ఇటు అధికారులు కానీ చర్యలు చేపట్టిన పాపానపోలేదన్నారు. ప్రధానంగా రెగ్యులర్ కార్మికులకు రెండేళ్ల బకాయి ఉన్న సరెండర్ లీవ్లు, డిఏలు, ఇంక్రిమెంట్లు, సకాలంలో యూనిఫాం, పనిముట్లు ఇవ్వాలని, చనిపోయిన పారిశుధ్య కార్మికులకు డెత్ బెనిఫిట్స్ ఇప్పించాలని, టెక్నికల్ సమస్యలతో వేతనం పడని వారికి వెంటనే వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్ ఈఎస్ఐ కు సంబంధించి కన్సల్టెంట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని, ఇంజినీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులకు 2011 సంవత్సరంలో 11 నెలల పిఎఫ్ బకాయి ఖాతాల్లోకి జమ చేయాలనే తదితర సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఈనెల 23వతేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే రెండు రోజులపాటు మెరుపు సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, రెగ్యులర్ కార్మికుల యూనియన్ నాయకులు ముత్తు రాజు, నల్లప్ప, ఓబుళపతి, పోతులయ్య, సంజీవరాయుడు, శ్రీనివాసమూర్తి, మరియమ్మ, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ అధికారులకు మెరుపు సమ్మె నోటీసు అందజేస్తున్న కార్మిక సంఘం నాయకులు, కార్మికులు










