ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలోని పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జగదీష్ హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మున్సిపల్ పారిశుధ్ద్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, కమిషనర్ కార్యాలయం ముందు దర్నా చేపట్టి, కమిషనర్ ప్రమోద్ కుమార్కు వినతిని ఇచ్చారు. ఈ సందర్బంగా ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జగదీష్, సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప మాట్లాడుతు పారిశుద్ధ్య కార్మికులతో ప్రభుత్వం గొడ్డు చాకిరి చేయిస్తోందన్నారు. ఆప్కాస్ వ్యవస్థ ద్వారా 60 ఏళ్లు నిండిన కార్మికులను బలవంతంగా తొలగించారన్నారు. వారి స్థానంలో వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మున్సిపాలిటీ కార్మికుల కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మెకు సిద్దం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లికార్జున, ఆనంద్, మంజునాథ్, నారాయణ, చంద్ర, నాగేంద్ర, రామాంజి, శివకుమార్, గురునాథ్, రామచంద్ర, కృష్ణమూర్తి, ఓబులమ్మ, శోభమ్మ, సుబ్బలమ్మ, లక్ష్మమ్మ, కవితమ్మ, క్లాప్ ఆటో డ్రైవర్లు అనిల్, కిషోర్, ప్రభాకర్తో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.










