Aug 21,2023 21:46

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సభ్యులు

సమస్యలు పరిష్కరించాలని వినతి
ప్రజాశక్తి-కావలి : పిఅండ్‌టి కో ఆపరేటివ్‌ సొసైటీలో పరిష్కారానికి నోచుకోని సభ్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం సొసైటీ పరిరక్షణ సమితి నాయకులు కోఆపరేటివ్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమితి చైర్మన్‌ ఎ.వి.కష్ణయ్య, కన్వీనర్‌ సిహెచ్‌.వెంకయ్య, వైస్‌చైర్మన్‌ బి.ఆంజనేయులు సోమవారం డిసిఒ బి.సుధా భారతిని కలిసి ఈ మేరకు మెమోరాండం సమర్పించారు. సొసైటీలో వందలాది మంది పోస్టల్‌, టెలికాం, జిడిఎస్‌, ఆర్‌ఎంఎస్‌ ఉద్యోగులు, సభ్యులు ఆతృతతో ఎదురు చూస్తున్న డివిడెండ్‌ను వెంటనే చెల్లించాలని కోరారు.
కార్యవర్గం లేకుండా సొసైటీ కొనసాగడంతో సభ్యుల్లో ఆందోళన నెలకొన్నదని, ఎన్నికలు జరిపించి నూతన కార్యవర్గాన్ని నియమించాలని, జనరల్‌ బాడీ నిర్వహించాలని కోరారు. డిపార్ట్మెంట్‌ ఉద్యోగులకు 10లక్షలు, జిడిఎస్‌ ఉద్యోగులకు రూ.6లక్షలు లోన్‌ పెంచి ఇవ్వాలని, ప్రతి నెలా రికవరీ వివరాలతో రశీదులు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభ్యుల సౌకర్యార్థం ఆదివారం పని దినంగానూ, పనిదినాల్లో ఉదయం 8గంటల నుండి 12గంటల వరకు మధ్యాహ్నం 3నుండి సాయంత్రం 7 గంటలవరకు సొసైటీ పనిచేసే విదంగా ఉత్తర్వులు జారీ చేయాలని డిసిఒను కోరారు. అందుకు ఆమె త్వరలో పరిష్కరిస్తామని డివిడెండ్‌ విజయదశమిలోపు చెల్లిస్తామని హామీఇచ్చారని సమితి నాయకులు వివరించారు. అనంతరం సొసైటీ మేనేజర్‌ జమీర్‌కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో పోస్టల్‌ నాయకులు ఎం.నాగరాజు, ఎన్‌.శ్రీధర్‌ రావు, ఎన్‌.భాస్కర్‌ రెడ్డి, ఎస్‌.సి, ఎస్‌.టి. నాయకులు దుడ్డు రమేష్‌, బాబు, జి.డి.ఎస్‌.నాయకులు ఎస్‌.వెంకటేశ్వర్లు, టెలికాం నాయకులు వెంకటరెడ్డి, సుధాకర్‌ రావు, పోస్టల్‌, టెలికాం, జిడిఎస్‌, ఆర్‌ఎంఎస్‌ సభ్యులు పాల్గొన్నారు.