రాస్తారోకో చేస్తున్న నాయకులు
సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో
ప్రజాశక్తి-కావలి రూరల్ :సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి చలో విజయవాడ పిలుపునివ్వగా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా కార్మికులకు పోలీసులు ముందస్తు నోటీసులిచ్చారు. దీంతో నిరసనగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ కూరగాయలు మార్కెట్ శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నందున ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలియ చేయాలన్నారు. దీంతో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వగా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని కార్మికులకు పోలీసుల ద్వారా ముందస్తు నోటీసులు ఇప్పించడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు. మహిళల కార్మికులకు కూడా నోటీసులు ఇచ్చి రకరకాలుగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయం అడిగేందుకు రాజధానికి వెళ్తుంటే కార్మికులను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వెళ్లకుండా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగునా అని ప్రశ్నించారు.ఇదేనా కార్మిక ప్రజల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలను అణిచివేయాలని చూసిన ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడలో లేవని ప్రశ్నించే గొంతును నొక్కి వేయాలని చూడడం చాలా దుర్మార్గమన్నారు. ఈ ఆలోచనలు ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన పర్మినెంట్ హామీని వెంటనే అమలు చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. డైలీ కార్మికులను అవుట్సోర్సింగ్ లో చేర్చుకోవాలని, క్లప్ డ్రైవర్లకు రూ.18500 వేతనం ఇవ్వాలని, ఆక్పాస్ విధానాన్ని రద్దు చేయాలని మున్సిపల్ కార్మికుల పని భారాన్ని తగ్గించాలని, ఇంకా వారికున్న సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి మధుసూదన్ రావు, తలపల రత్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శిలు తురక సీనయ్య, బిడదల మహేష్, నాయకులు ఒంగోలు రమేషు, కావలి బాబు, పరుశు జేమ్స్, క్రాంతి కుమార్ ,మహిళా నాయకులు పల్లిపాటి అనిత, పరుస చిన్నమ్మ ,లేటు రాజ్యలక్ష్మి, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










