ప్రజాశక్తి-అద్దంకి: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు పి తిరుపతిరెడ్డి, గంగాధర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ ఆవరణలో ఫెడరేషన్ నాయకులు బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు పి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ విడతల వారీగా అద్దె బస్సులను రద్దు చేసి ఆర్టీసీ బస్సులను వెంటనే పెంచాలని ఆయన అన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అద్దె బస్సులను పూర్తిగా తగ్గించాలని, కొత్త ఆర్టీసీ బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని, స్థలాలను అన్యాక్రాంతం కాకుండా బస్టాండ్లు ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని అన్నారు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులను ఇవ్వాలని, డీజిల్ ధరలను తగ్గించాలని, టోల్గేట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2017 అరియర్స్ ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి డబ్బులు ఇవ్వాలని, నైట్ అవుట్, ఇతర అలవెన్సులతో పాటు పెండింగ్లో ఉన్న ఆరు సంవత్సరాల ఎన్క్యాష్మెంట్ ఇవ్వాలని, వైద్య సేవలు పాత పద్ధతిలో కొనసాగాలని, పెండింగ్ డిఏలు, అరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు. అన్ని కేటగిరిలోని ఖాళీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ కార్మికులు డిఏవి సుబ్బారావు, మహిళా కండక్టర్ తదితరులు పాల్గొన్నారు.










