
7వ వార్డులో..
ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి 7వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై కమిషనర్ రాజబాబుకు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ వినతిపత్రం సోమవారం అందించారు. మిధిలాపురి వుడాకాలనీలో డ్రెయినేజి సమస్య, వార్డు పరిధిలో పలు చోట్ల వీధి దీపాలు లేవని, కాలనీలో పార్కులను అభివృద్ధి చేయాలని కోరుతూ టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకట్రావు, ఫ్లోర్ ఇన్ఛార్జి పీలా శ్రీనివాస్తో కలిసి వినతిపత్రం అందించారు.
మూడో వార్డులో ..
భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాముకు టిడిపి నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. మినీ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఓపెన్ జిమ్ను వినియోగంలోకితేవాలని, ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేయాలని వినతిలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, మాజీ కౌన్సిలర్ సిహెచ్.రమణ, నాయకులు ఎం.సంజీవకుమార్, కె.అప్పలనాయుడు, కొక్కిరి అప్పన్న, గండిబోయిన పోలిరాజు, వియ్యపు పోతురాజు తదితరులు పాల్గొన్నారు. జోనల్ కమిషనర్ను సన్మానించారు.
రెండో వార్డులో..
తగరపువలస : రెండో వార్డు పరిధి ఆదర్శ నగర్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న పలు విద్యుత్ స్తంబాలు తొలగించాలని కోరుతూ జివిఎంసి కమిషనర్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ (విపత్తుల శాఖ) రాష్ట్ర ఉపాధ్యక్షులు శీరపు రామలక్ష్మి సోమవారం వినతిపత్రం అందజేశారు. జివిఎంసి క్లాప్ వాహనం, సివిల్ సప్లై వాహనం, అంబులెన్స్ రావడానికి వీలు లేని పరిస్థితి ఉందని వివరించారు. గతంలో ఇదే సమస్యపై భీమిలి జోనల్ కమిషనర్కు పలుమార్లు వినతులు ఇచ్చామని, అయినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో కవిత, వెంకటేశ్వరరావు, మంగవేణి తదితరులు ఉన్నారు.