
విఆర్ఎలను ఫేస్ యాప్ అటెండెన్స్ బయోమెట్రిక్ నుంచి మినహాయించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన విశాఖ, అనకాపల్లి జిల్లాల కలెక్టరేట్ల వద్ద మంగళవారం ధర్నాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో విఆర్ఎలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం)
విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు పి.వెంకటరావు, కన్వీనర్ సత్యం మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. రికవరీ చేసిన డిఎ తిరిగి చెల్లించాలన్నారు. పలు సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
అనకాపల్లి : సమస్యలపై విఆర్ఎలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం వల్ల విఆర్ఎలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాలకు దూరంగా వీరు విధులు నిర్వహించడం వల్ల, ఎక్కువ మంది చదువుకోకపోవడం వల్ల ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోలేరన్నారు. పే స్కేల్ అమలు చేయాలని, రికవరీ చేసిన డిఎను తిరిగి చెల్లించాలని, అర్హత ఉన్న విఆర్ఎలకు ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. నామినీగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో విఆర్ఎల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రవికుమార్, కె.లోవరాజు, ఉపాధ్యక్షులు నరేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.శాంతి కుమారి, కోశాధికారి ఎన్.సంతోష్, సహాయ కార్యదర్శి డేవిడ్ పాల్గొన్నారు.