ప్రజాశక్తి-పంగులూరు: శాసనమండలి ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్బాబు, సిఐటియు మండల కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మండలంలోని చందలూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసనమండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే, పిడిఎఫ్ సభ్యులు ఉండాలని అన్నారు. గత 18 సంవత్సరాల నుంచి శాసనమండలిలో అనేక సమస్యల గురించి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాట్లాడారని అన్నారు. సామాన్య ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగుల కోసం, వారి హక్కుల కోసం, నికరంగా పోరాడిన చరిత్ర పిడిఎఫ్ ఉందని రాయిని వినోద్ బాబు, మల్లారెడ్డి అన్నారు. ప్రలోభాలు పెట్టి ఓట్లు దండుకొని, సీట్లు కాజేసి అధికారాన్ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవాలని అధికారపక్షం ప్రయత్నిస్తుందని విమర్శించారు. విజ్ఞానవంతులు, మేధావులు ఉండే సభలో రాజకీయాల కతీతంగా పనిచేసే పిడిఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డిని, ఉపాధ్యాయ అభ్యర్థి బాబురెడ్డిని గెలిపించాలని కోరారు.










