Jul 05,2023 00:20

కోర్టు సముదాయం ముందు ధర్నా చేస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి-అనకాపల్లి
ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఎఎల్‌) పిలుపులో భాగంగా అనకాపల్లి యూనిట్‌ ఆధ్వర్యంలో న్యాయస్థానముల భవన సముదాయం వద్ద అపరిష్కృతంగా వున్న న్యాయవాదుల డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఎల్‌ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల మాధవరావు, పిళ్లా హరశ్రీనివాసరావు, పి.అప్పలనరసింహం (బాబు), కార్యదర్శి అడపా సుధాకర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాయిలక్ష్మణ్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ అనకాపల్లిలో అద్దె బిల్డింగ్‌ కాకుండా ప్రభుత్వం నూతన కోర్టు భవనాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గూండాల పాశవిక దాడుల నుండి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. న్యాయవాదులు మరణిస్తే చెల్లించే డెత్‌ ఫండ్‌ను రూ.8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాలని, న్యాయవాదుల సంక్షేమం కోసం తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేయాలని, లా నేస్తం నిధుల్ని సక్రమంగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నూకరాజు, సురేష్‌, రెడ్డి నాయుడు, ఆడారి శరత్‌, జి. రేణుకాదేవి, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.