
ప్రజాశక్తి-ఉక్కునగరం : కాంట్రాక్టు కార్మికులకు ఎన్జెసిఎస్లో వేతనాలు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల వేతన జిఒను వెంటనే విడుదల చేయాలని, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని డిమాండ్ చేస్తూ స్టీల్ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన సెంట్రల్ స్టోర్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు ఒవి.రావు మాట్లాడుతూ, ఐదేళ్లకోసారి వేతన సవరణ జరిగే ప్రక్రియలో జిఒ కాలం పూర్తయినప్పటికీ ఇంకా యాజమాన్యం చేయకపోవడం దుర్మార్గమన్నారు. యాజమాన్యాలు కార్మికులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ నెల 12వ తేదీన బొకారోలో జరుగనున్న జాతీయ స్టీల్ కాంట్రాక్టు కార్మికుల కన్వెన్షన్లో కాంట్రాక్టు కార్మికులు సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
యూనియన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టీల్ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులను చైతన్యం చేసి పోరాటం చేస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కారం కోసం ఉక్కు యాజమాన్యం ముందుకు రావాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరహాలు, కృష్ణ, చట్టి నర్సింగరావు, మసేను, సోమేష్, ఆడారి అప్పారావు, కెపి.నాయుడు, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.