
ప్రజాశక్తి -కంచరపాలెం : సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కంచరపాలెం పరిధి బాపూజీనగర్ వద్ద ఏపీ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన కమిటీ అధ్యక్షులు గొలుసు నూకరాజు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం.ఈశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తుల నుంచి వృత్తిదారులను దూరం చేస్తూ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వల్ల చేతివృత్తులన్నీ ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో 1.70 కోట్ల మంది వివిధ చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 56 రకాల కార్పొరేషన్లు పెట్టినప్పటికీ నిధులు లేవన్నారు. రజక, చేనేత, వడ్రంగి, దర్జీ, కంచర, కమ్మర, కుమ్మరి, మేదర, సౌర, వడ్డెర, కల్లుగీత, గొర్రెలు మేకల పెంపకం, వాల్మీకి, బోయి, తదితరులు నేడు వృత్తులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేతివృత్తిదారులను ఆదుకోవాలని కోరారు. వృత్తిదారుల కుటుంబాలకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని, రజక వృత్తికి దోబీఘాట్లు, వృత్తి స్థలాలు కేటాయించాలని, చేనేత కార్మికులకు మగ్గం చెడ్డతో కూడిన ఇల్లు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని, కమ్మరి, వడ్రంగి, సెలూన్ వృత్తిదారులకు పనిముట్లు ఇవ్వాలని, అన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా చేత్తివృత్తిదారులందరికీ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని, కళ్ళు గీత వృత్తి అభివృద్ధికి, ఆధునికీకరణకు నిపుణులతో కమిటీ వేయాలని, రాష్ట్ర బడ్జెట్లో చేతివృత్తులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈశ్వరరావు, కె.నూకరాజు, కమ్మరి వడ్రంగుల సంఘం అధ్యక్షులు కె.అప్పారావు, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు దమ్ము అప్పారావు, టిటి.రాము, ఎ.అప్పారావు, వి.శ్రీనివాసరావు, బి.నాగరాజు, బి.సురేష్, వృత్తిదారులు పాల్గొన్నారు.