
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయాలకు వస్తారని వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సమస్యల పరిష్కారమే ముఖ్య లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులతో కలెక్టర్ అర్జీలు స్వీకరించడమే గాక సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సమస్య ఎక్కడ ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు పరిష్కరించినప్పుడే జిల్లా యంత్రాంగం మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. మండల, డివిజన్ కార్యాలయాల్లో కూడా వచ్చే అర్జీలను పరిష్కరించినట్లయితే ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్కు రారన్నారు. ఎక్కడికి అక్కడ పరిష్కారానికి ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలని రెండవసారి అర్జీదారులు రాకుండా సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, డిఆర్డిఎ పీడీ నరసయ్య, డిఎల్డిఒ శివారెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.