Aug 11,2023 21:55

ధర్నా కరపత్రాలను విడుదల చేస్తున్న భవననిర్మాణ కార్మికులు

కలెక్టరేట్‌: తమ సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాటిని అమలు చేయలేని కోరుతూ ఈనెల 17న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయనున్నట్టు భవన నిర్మాణ కార్మిసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.గౌరీశ్వరరావు, రాయిపల్లి రాము తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట భవన నిర్మాణ కార్మికుల బతుకులు నాశనం చేసే ఇసుక విధానం తీసుకొచ్చారని విమర్శించారు. కరోనా సమయంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆర్ధాకలితో ఇబ్బందులు పడ్డా ముఖ్యమంత్రి కనికరించలేదన్నారు. పైగా భవనిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాజశేఖరరెడ్డి సంక్షేమ బోర్డును ప్రవేశపెడితే, ఆయన కొడుకైన జగన్మోహన్‌ రెడ్డి ఈ బోర్డును రద్దు చేయడం అత్యంత దారుణన్నారు. సంక్షేమ బోర్డు రద్దుతో భవన నిర్మాణ కార్మికులు అనేక సంక్షేమ పథకాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కావున సంక్షేమ బోర్డు పునరుద్ధరించి పిల్లలకు స్కాలర్‌షిప్‌, గుర్తింపు కార్డులు, పెండింగ్‌ క్లైములు, ఇన్సూరెన్స్‌, ఇఎస్‌ఐ వంటి సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 17న కలెక్టరేట్‌ వద్ద జరుగు ధర్నాలో 15 మండలాలకు భవన నిర్మాణ కార్మికుంతా పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పైల సత్యనారాయణ, మజ్జితాడి శ్రీనివాసరావు, భోగు మల్లేశ్వరరావు, మరడాన రవికుమార్‌, పోల రాజు, నాగూరు సంజీవరావు, ఎ.శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.