ప్రజాశక్తి -ములగాడ : పారిశ్రామిక ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని వైసిపి నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు తెలిపారు. ఇందిరా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో తాగునీటి సరఫరాకు సమయపాలన లేదన్నారు. ఒక్కోరోజు పూర్తిగా సరఫరా చేయడంలేదని తెలిపారు. హెచ్పిసిఎల్ పనుల్లో సింధియా నుంచి జింక్ గేటు వరకు రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్లను తొలగించారని, దీని వల్ల రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమస్యలపై జిల్లా యంత్రాంగం, మేయర్ స్పందించి పరిష్కరించాలని కోరారు. అనంతరం ఈ ప్రాంతంలో వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, మహిళలు పాల్గొన్నారు.










