సిఐటియు రంపచోడవరం జిల్లా కార్యదర్శి వెంకట్
ప్రజాశక్తి - రంపచోడవరం : అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రంపచోడవరం జిల్లా కార్యదర్శి పి వెంకట్ డిమాండ్ చేశారు. ఆదివారం రంపచోడవరం సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షరాలు ఎం.వాణిశ్రీ అద్యక్షతన ఆఫీస్ బేరర్స్ జిల్లా సమావేశం జరిగింది. ఈసందర్భంగా వెంకట్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా కార్మికుల హక్కులు, చట్టాలపై దాడి చేస్తూ, కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మికచట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ మార్చి కార్మికులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను గాలికొదిలేసి, కార్పొరేట్ శక్తులకు ప్రజాసంపదను దోచిపెడుతున్నాయని మండిపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. స్కీం వర్కర్లకు కనీసవేతనం రూ 26వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేసారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విఒఎల సమస్యల పరిష్కారానికి నవంబర్ 3న రంపచోడవరం ఐటిడిఎ వద్ద జరిగే ధర్నాలో పెద్దసంఖ్యలో విఒఎలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి నిర్మల, కె శాంతిరాజు, రామరాజు, పి సత్యనారాయణ, కె పెంటయ్య, కె రమణమ్మ పాల్గొన్నారు.










