ప్రజాశక్తి-కశింకోట
ప్రజల సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం కసింకోటలోని రెల్లివీధి, మేదర వీధి ప్రాంతాల్లో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఒక పేద కుటుంబ వద్దకు మంత్రి వెళ్లగా, శిథిలావస్థకు చేరుకున్న తమ ఇంటిని మంత్రికి చూపించి తమకు పక్కా ఇంటిని మంజూరు చేయాలని కోరారు. దీంతో మంత్రి అక్కడే ఉన్న అధికారులను పిలిపించి, వీరికి పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఏర్పాటు చూయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ రాజు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాస్, సర్పంచ్లు కలగా గున్నయ్యనాయుడు, మంత్రి జయ రజని, వైసిపి నాయకులు మళ్ళ బుల్లి బాబు, మలసాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.










