ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రమాదాల నివారణకు అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐ-రాడ్ లో పెండింగ్ ఉన్న కేసు లన్నిటినీ శనివారంలోగా డిస్పోజ్ చేయాలని తెలిపారు. పోలీస్, మెడికల్, హైవే , ట్రాన్స్పోర్టు శాఖలు వారి లాగిన్ లో ఉన్న కేసులను సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు. ప్రమాదాల నివారణకు ఓవర్ లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వాడకం, సెల్ ఫోన్ డ్రైవింగ్ పై డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. కళాశాలల్లో, విద్య సంస్థల్లో యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇకపై ప్రతి మొదటి శుక్రవారం రోడ్ సేఫ్టీ సమావేశం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో రవాణా శాఖ ఉప కమిషనర్ రవీంద్ర నాధ్, మున్సిపల్ కమిషనర్ శ్రీ రాములు నాయుడు, ట్రాఫిక్ పోలీస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
క్లెయిమ్లు తక్షణమే పరిష్కరించాలి
విజయనగరం :ఓటర్ల సవరణలో భాగంగా ఫారం 6,7,8 కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఈ శుక్రవారం లోగా పూర్తి కావాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు కు పలు సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఒ అనిత తదితరులు హాజరయ్యారు. బుధవారం నుంచి ఇవిఎంల వెరిఫికేషన్ చేపట్టి 14 లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమంలో రాజకీయ పార్టీలు సమర్పించిన క్లెయిమ్లు, అభ్యంతరాలు, చనిపోయిన, డూప్లికేట్, బదిలీ చేయబడిన, నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్, ఎపిక్ కార్డ్ జనరేషన్, తదితర ఆన్లైన్లో పెండింగ్ ఉన్న అంశాలను వెంటనే డిస్పోజ్ చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రిటర్నింగ్ అధికారులు పద్మలత, సుదర్శన దొర, వెంకటేశ్వర రావు, నూక రాజు, అప్పారావు, శేష శైలజ , డిటిలు పాల్గొన్నారు.










