ప్రజాశక్తి - మేడికొండూరు : మండలంలోని పేరేచర్ల నికో ఆయిల్ ఆగ్రో కంపెనీలో కార్మికులకు వేతనాల పెంపుదలపై సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకూ వెనకాడబోమని యూనియన్ ప్రకటించిన నేపథ్యంలో యాజమాన్యం స్పందించింది. కార్మిక సంఘం నాయకులను సోమవారం సంప్రదించి సమ్మెదాకా వెళ్లొద్దని, చర్చించుకుందామని ప్రతిపాదించింది. దీనిపై యూనియన్ నాయకులు బి.లక్ష్మణరావు స్పందిస్తూ కార్మికుల తరుపున డిమాండ్లపై పత్రాన్ని యాజమాన్యానికి ఇచ్చారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు వద్దని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఎం బాష, కెఎస్ రెడ్డి, షేక్ జాన్పీరా, ఎన్గోపికృష్ణ పాల్గొన్నారు.










