Oct 24,2023 20:37

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
స్మార్ట్‌ మీటర్లను ప్రజలందరూ వ్యతిరేకించాలి సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. తాడేరు గ్రామంలో స్మార్ట్‌ మీటర్లను ఆదిలోనే వ్యతిరేకించాలని కోరుతూ మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ, షాపునకు స్మార్ట్‌ మీటర్లు పెట్టడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలిపారు. ప్రతి కనెక్షన్‌పై 13000 రూపాయలు ప్రజలే చెల్లించాలని అంటోందని తెలిపారు. ఒకేసారి చెల్లించాలంటే ప్రజలు వ్యతిరేకిస్తారని 10 సంవత్సరాలపాటు నెలకు 150 రూపాయలు చొప్పున వసూలు చేయడానికి పూనుకుంటోందన్నారు. స్పాట్‌ మీటర్లు తయారు చేసే కంపెనీ అదానికి అప్పజెప్పిందన్నారు. స్మార్ట్‌ మీటర్లు పెడితే గనుక ముందు డబ్బు చెల్లించి కరెంటు వినియోగించుకునేలా సెల్‌ ఫోన్‌ మాదిరిగా ప్రీపెయిడ్‌ పద్ధతి కూడా వస్తుందని తెలిపారు. ప్రజలపై పెనుభారం మోపే స్పాట్‌ మీటర్లు ఆదిలోనే వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, తాతారావు, రాంబాబు పాల్గొన్నారు.