
ప్రజాశక్తి-చింతూరు
ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు ఎఎస్ఆర్ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. చింతూరు డివిజన్లోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్స్ సమావేశం యూనియన్ నాయకులు సోడి దుర్గారావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పాల్గొన్న వెంకట్ మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్.జగన్ నాలుగున్నరేళ్లు గడిచినా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదన్నారు. వర్కర్లు చనిపోతే కనీసం ఎక్స్గ్రేసియా కూడా చెల్లించడం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు 119, 25 ఎక్స్గ్రేసియా జీవోలు ఉన్నా వాటిని ఐటిడిఎ అధికారులు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. చింతూరు డివిజన్లో 11 మంది వర్కర్లు చనిపోగా ఒక్క రూపాయి కూడా వారి కుటుంబాలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్స్గ్రేసియా జీవోలు అమలు చేయాలని, హెచ్ఆర్ఎ, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, యూనిఫారం పంపిణీ చేయాలని, విద్యార్థుల సంఖ్య కనుగుణంగా వర్కర్ల పోస్టులను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని, రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే జీతాలు పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించుకోగలమని, గత చరిత్ర అదే చెబుతుందని తెలిపారు. వైసిపి ప్రభుత్వంపై భ్రమలతో నాలుగున్నరేళ్ల పాటు పోరాటాలకు దూరంగా ఉండి ఏమీ సాధించలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఔట్ సోర్సింగ్ కార్మికులందరూ ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చంద్రమ్మ, రాజమణి, వీరయ్య, తిరుపతమ్మ, రమణమ్మ, సీతమ్మ, వీరస్వామి, రాంబాబు, బాబురావు, చంద్రయ్య, నాంచారమ్మ, సత్యవతి, శాంతమ్మ, రాములమ్మ, సీతమ్మ, ముత్తమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.