ప్రజాశక్తి-చీరాల
సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి సుభాషిణి పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ ఆదెళ్ల కృష్ణ, రమ్య, రచిత్, చైత్రల సహకారంతో శనివారం ఆసుపత్రిలోని బాలింతలు, రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ సేవలోనే నిజమైన ఆనందం ఉందని, సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రి అభివృద్ధికి క్లబ్ల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తోడ్పాటునందించాలన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు క్లబ్ ప్రతినిధులు, దాతలను ఆమె అభినందించారు. ప్రతి నెలా ఇటువంటి కార్యక్రమానికి బండారుపల్లి హేమంతకుమార్, అడ్డగడ మల్లికార్జునరావు, పుల్లెల సుబ్రహ్మణ్యేశ్వరరావు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నన్నపనేని రామకృష్ణ, బాచిన నాగమల్లేశ్వరరావు, ట్రెజరర్ వంశీకృష్ణ, తాడివలస దేవరాజ్, రావి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.










