ప్రజాశక్తి - నరసరావుపేట : సిగల్స్ లేని పల్నాడు జిల్లా శివారు గ్రామాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని గుంటూరు టెలికం జిల్లా సేల్స్, మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎం.ఎస్.ప్రసన్న కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేలోని ఎర్రాప్రగడ టెలికాం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వినియోగదారుల అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 20 ఎక్స్ఛేజీలున్నాయని, 2 వేల ల్యాండ్ లైన్ కనెక్షన్లు, 4,400 ఫైబర్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ 15 వైఫై పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. నరసరావుపేట డిఇ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రైవేటుతో ప్రమేయం లేకుండా చిలకలూరిపేట, నరసరావుపేట కస్టమర్ సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్డిఇ నాగరాజు మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తున్నామన్నారు. జెటిఒ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి వినియోగదారునికి తమ వంతుగా సేవలు అందిస్తున్నామన్నారు. టెలికం సలహా కమిటి ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం చేకూరబోతున్నట్లు చెప్పారు. 4జి, 5జి సేవలను అందించేందుకు కేంద్రం ప్రభుత్వం రూ.89,047 కోట్ల కేటాయించిందని చెప్పారు.










